ఇష్టారాజ్యంగా రోడ్డు విస్తరణ... వంద ఫీట్ల రోడ్డును 85 ఫీట్లకే కుదిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా రోడ్డు విస్తరణ... వంద ఫీట్ల రోడ్డును 85 ఫీట్లకే కుదిస్తున్నారు

Jun 21 2023 3:30 AM | Updated on Jun 21 2023 1:38 PM

రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తున్న సదానందరెడ్డి తదితరులు - Sakshi

రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తున్న సదానందరెడ్డి తదితరులు

తాండూరు టౌన్‌: పట్టణం మీదుగా వెళ్తున్న నేషనల్‌ హైవే లింకు రోడ్డు విస్తరణ పనులు అడ్డదిడ్డంగా కొనసాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. మంగళవారం పలువురు నాయకులతో కలిసి ఎన్‌హెచ్‌ 167 రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో బూత్పూర్‌ నుంచి కర్ణాటకలోని మన్నెకెళ్లి వరకు నేషనల్‌ హైవే పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాండూరు పట్టణం గుండా హైవేకు కలిపే లింక్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్డు విస్తరణకు వంద ఫీట్ల వరకు ఉండాలని హైవే అధికారులు నిర్ణయించగా..

కేవలం 85 ఫీట్లు మాత్రమే విస్తరణ జరుగుతోందన్నారు. పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు భవనాలను కూల్చేయకుండా ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా 85 ఫీట్ల మేరకు మాత్రమే విస్తరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై తాండూరు ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, రోడ్డు కాంట్రాక్టరు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన రోడ్డు డివైడర్‌పైనే సిమెంటు పూత పూసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికార పార్టీ నాయకుల ఆస్తులను కాపాడేందుకే రోడ్డు ఇరుకుగా నిర్మిస్తున్నారన్నారు.

అక్రమాలపై నేషనల్‌ హైవే అథారిటీ అధికారుల ఫిర్యా దు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తామే తెచ్చినట్లుబీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈనెల 22న తాండూరుకు రానున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తామని తెలిపారు. వీరివెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌ గౌడ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ రజినీకాంత్‌, మున్సిపల్‌ ఫ్లో ర్‌ లీడర్‌ అంతారం లలిత, కౌన్సిలర్‌ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement