
మొక్కను పరిశీలిస్తున్న రైతు
బొంరాస్పేట : వ్యవసాయంలో తలెత్తే చెదలను పూర్తిగా తొలగిస్తేనే అధిక దిగుబడులు వచ్చి లాభాలు పొందవచ్చు. చెదల నివారణపై రైతులకు అవగాహన తప్పనిసరి. లేనట్టయితే సాగులోని పళ్లతోటలు, పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై వ్యవసాయ అధికారులు అందించే సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి. చెదలు మిగతా చీమలు, తేనెటీగల వలె సంఘజీవులు. చెదల సమూహాలు ఒక సంఘాలుగా ఉండి కొన్ని పురుగుల ఒక రకమైన పని, ఇతర పురుగులు వేరొక పనిని చేస్తాయి. చెద పురుగులలో రాణి, రాజు, శ్రమ, సైనిక చెద పురుగులు ఉంటాయి. రాణి పురుగు ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది. కార్మిక జీవులు ఎక్కువ సంఖ్యలో ఉండి రాణి పురుగు పెట్టిన గుడ్లను, చిన్న పిల్ల పురుగులను కాపాడుతూ ఉంటాయి. ఇవి పంటలలో చాలా నష్టాన్ని కలిగించి మొక్కల వేరు, కాండం భాగాలను ఆశించి నష్టం కల్గిస్తాయి. ఇవి వ్యవసాయ పంటల్లో ముఖ్యంగా గోధుమ, వరి, చెరకు, కూరగాయలు, చిరుధాన్యాలు, పత్తి, వేరుశనగ, ఆముదం పంటల్లో మొక్కలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. పండ్ల తోటలైన మామిడి, జామ, నిమ్మ, ద్రాక్ష, దానిమ్మ, సపోట, సీతాఫలం మొదలగు వాటిని ఆశించి నష్టాన్ని కల్గిస్తాయి. ఈ పండ్ల తోటల్లో ముఖ్యంగా నీటి పారుదల సరిగ్గాలేని తోటలలో చెదల సమస్య ఎక్కువగా ఉంటుంది. నాటిన తొలిదశలో ఆశించినట్లయుతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. తొలిదశలో నివారించకపోతే కొమ్మలు, చెట్లు ఎండిపోయి దిగుబడులు తగ్గుతాయి. ఇతర పంటలైన కొబ్బరి తదితర మొదలైన వాటిని కూడా ఇవి ఆశించి చాలా నష్టాన్ని కల్గిస్తాయి.
రైతులకు అవగాహన తప్పనిసరి
వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు
నివారణ ఇలా..
చెద పురుగులు మట్టితో కప్పబడి ఉంటాయి. వీటిని నివారించడం కష్టంతో కూడుకున్న పని. కింద తెలిపిన విధంగా చేసినట్లయితే కొంత వరకు చెద పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
పొలాన్ని లోతుగా దున్నితే భూమిలోపల ఉండే చెద పురుగుల పుట్టలను, చెద పురుగులను నాశనం చేయవచ్చు.
పంట పొలాల గట్లపైన లేక పొలంలో చుట్టూ ఉన్న చెద పురుగులను పూర్తిగా తవ్వి రాణి పురుగును వెలికి తీసివేయాలి.
5మి.లీ. క్లోరిఫైరిఫాస్ 50ఇ.సి. మందును లీటరు నీటికి కలిపి సుమారు 15–30లీటర్ల మందు ద్రావణాన్ని చెద పుట్టలలో బాగా తడసేటట్లు పోయాలి.
సరిగ్గా కుళ్లని సేంద్రియ పదార్థం చెద పురుగుల్ని ఆకర్షిస్తుంది. కనుక బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఉపయోగించాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 6మి.లీ. క్లోరిఫైరిఫాస్ మందును కలిపి విత్తనశుద్ధి చేసినట్లయితే చెద పురుగుల నుంచి కాపాడవచ్చు.
చెరకు పంటలో చెదల నివారణకు 2మి.లీ.మలాథియాన్ మందును లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని 15 నిమిషాలు ఉంచి తర్వాత మొదల్లో వేయాలి.
పండ్ల తోటల నారుమడులను తయారుచేసేటప్పుడు లిండేను, మిథైల్ పరాథియాన్ లాంటి పొడి మందును నారు మడుల్లో కలపాలి.
పండ్ల మొక్కలు నాటే గుంతలలో మిథైల్ పారథియాన్ లేదా లిండే పొడి మందును 100గ్రాముల మోతాదులో కలిపి వేయాలి.
పాలిథిన్ సంచులతో మొక్కలను పెంచేటప్పుడు లిండేను లేదా మిథైల్ పరాథియాన్ పొడి మందును ఒక కిలో ఒక ఘనపుటడుగు మట్టి మిశ్రమానికి కలిపి సంచులలో నింపి విత్తాలి.

చెట్టు మొదలుపై ఏర్పడిన చెదలు