తమిళనాడుకు తరలిస్తున్న అక్రమార్కులు
దందాకు సహకరిస్తున్న టీడీపీ నేతలు
కన్నెత్తి చూడని అధికారులు
సత్యవేడు: మండలంలో మట్టిదోపిడీ మొదలైంది. చెన్నేరి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో క్వారీ అనుమతి పొంది వేరొకచోట గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. రోజూ వందలాది టిప్పర్లతో రూ.లక్షల విలువైన మట్టి తమిళనాడుకు వెళ్లిపోతోంది. అడ్డుపడిన గ్రామస్తులను పట్టించుకోవడం లేదు. అధికారులనూ లెక్కచేయడం లేదు. గ్రావెల్ మాఫియాకు టీడీపీ నేతలు అండగా నిలవడంతోనే ఈ దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అనుమతి ఒక చోట..తవ్వేది మరో చోట
చెన్నేరి పంచాయతీ పరిధిలో సర్వే నం.82, 83లో 2.42 ఎకరాల మేర తమిళనాడు చెందిన ఓ వ్యక్తి మట్టి క్వారీకి అనుమతి పొందారు. కానీ గ్రావెల్ తవ్వకాలు సర్వే నం.86లో జరుపుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా కన్నెతి చూడడం లేదు.
కాలనీకి ముప్పు
చేన్నేరి వద్ద ఇల్లులేని నిరుపేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సుమారు 20 మందికి పైగా పట్టాలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ కాలనీలో కొంత మంది ఇళ్లు కూడా నిర్మించుకుని నివాసాలున్నారు. ఈ ఇళ్లకు 15 అడుగుల దూరంలో మట్టి క్వారీ కొనసాగుతోంది. అందులో 20 అడుగుల లోతు వరకు పెద్ద పెద్ద గుంతలు తీసేశారు. జగనన్న కాలనీలో విద్యుత్ సౌకర్యం, నీటి వసతికి కోసం బోరు కూడా ఏర్పాటు చేశారు. ఈ మట్టి తవ్వకాల వల్ల వర్షాలప్పుడు తమ నివాసాలకు ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నిత్యం వందలాది టిప్పర్లు తమ కాలనీ మీదుగా మట్టి తరలిస్తుండడంతో రోడ్డు గుంతలమయంగా మారిందని వాపోతున్నారు.
క్వారీ గోతుల్లో ఊటనీరు
చెన్నేరి జగనన్న కాలనీ సమీపంలో గ్రావెల్ తవ్వకాలు
తెర వెనుక తమ్ముళ్లు
చెన్నేరి జగనన్న కాలనీ వద్ద గ్రావెల్ దందా వెనుక ఓ వర్గం టీడీపీ నేతలు ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాయకుల అండదండలతో తమిళనాడుకు మట్టి అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా అనుమతులు తీసుకుని గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు.


