చిత్తూరు కలెక్టరేట్: ఆరు నెలలుగా జీతాల్లేవు.. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. జీతాలు ఇచ్చి ఆదుకోండి అని తిరుపతి జిల్లా రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు వాపోయారు. వారు సోమవారం పీజీఆర్ఎస్లో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వారు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, రుయా ఉద్యోగుల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు లేవన్నారు. మూడు నెలల క్రితమే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోదన్నారు. కార్మికులతో ప్రతిరోజూ పని చేయించుకుంటూ, వేతనాల విషయంలో బాధ్యత నుంచి తప్పుకోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మికులు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర వస్తువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకుని రుయా ఆస్పత్రిలోని 12 మంది కార్మికులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్ పరిధిలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎన్వో, ఎంఎన్వోల ప్రతినిధులు గాంధీ, సురేష్, సుధీర్, శ్రీకాంత్ రెడ్డి, ప్రసన్న, స్టెల్లా తదితరులు పాల్గొన్నారు.


