తిరుపతి అన్నమయ్యసర్కిల్: కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మానవత్వం చాటుకున్నారు. కరకంబాడి సమీపంలోని బీసీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన నలుగురు దివ్యాంగులకు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గంప పరశురామయ్య, గంప మునెమ్మ దంపతుల సంతానం అయిన గంప చంద్రశేఖర్, గంప రాజేశ్వరి, గంప రవి, అదే కుటుంబానికి చెందిన దేరంగుల వీరభద్రలు తమ దయనీయ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కుటుంబంలో నలుగురు సభ్యులు మానసిక, శారీరక దివ్యాంగులుగా ఉండడంతో కలెక్టర్ చలించిపోయారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తక్షణ సాయంగా రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ నలుగురికీ పెన్షన్, సదరం సర్టిఫికెట్స్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, శ్రీజనతా సేవా మిత్ర హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.


