వరదయ్యపాళెం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం తిరుపతిలో నూకతోటి రాజేష్ అధ్యక్షతన జరిగిన సర్ సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను వెంటనే వార్ రూమ్కు తెలిపి, పరిష్కరించుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావు లేకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమన్వయకర్త నూకతోటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని బూత్లలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, లీగల్ సెల్ పర్యవేక్షణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూస్తున్నామని తెలిపారు. అందరి సమన్వయంతో సత్యవేడు నియోజకవర్గంలో సర్ కార్యక్రమం విజయవంతం చేయాలని నియోజకవర్గ పరిశీలకులు దబ్బల శ్రీమంత్ రెడ్డి కోరారు. పార్టీ నిర్దేశం మేరకు సత్యవేడు నియోజకవర్గంలోని 279 పోలింగ్ బూత్లలో సర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అలాగే పూర్తిస్థాయిలో బీఎల్ఏల పనితీరును కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సర్ నియోజకవర్గ ఇన్చార్జి వేలూరు రాకేష్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, పార్టీ వరదయ్యపాళెం మండల అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, నియోజక వర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, నాయకులు భానుప్రకాష్రెడ్డి, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


