తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో అన్ని యూజీ కోర్సుల విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ఫీజును ఈనెల 27వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందని, రూ.వెయ్యి జరిమానాతో జూలై ఒకటో తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. పరీక్షల ఫీజు వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు గడువులోపు ఫీజు చెల్లించాలని సూచించారు.
రెండో విడత తొలిరోజు 108 మందికి ప్రవేశాలు
తిరుపతి సిటీ: టీటీడీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో 108 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో 41 మంది విద్యార్థులు ప్రవేశాల పొందగా, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో 67 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. శుక్రవారం వరకు రెండో విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అదే రోజు తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.


