తిరుపతి సిటీ: ఎస్వీయూలో తొలగించిన టీచింగ్ అసిస్టెంట్లకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఎస్వీ యూకు విచ్చేసిన ఆయనను వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, విద్యార్థి నేతలు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు టీచింగ్ అసిస్టెంట్ల సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీలో 45 మంది టీచింగ్ అసిస్టెంట్లను తొలగించడం బాధాకరమని, జీవనోపాధి కోల్పొయి రోడ్డున పడిన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ధీరజ్ రెడ్డి, రాజశేఖర్, కొండ యుగంధర్, సుకుమార్, పవన్, ప్రభ పాల్గొన్నారు.


