నాయుడుపేట టౌన్: స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ విధానంపై (ఎస్ఐఆర్) వైఎస్సార్ సీపీ బూత్ లెవల్ ఏజెంట్లు నిఘా పెట్టి పని చేయాలని, దొంగ ఓట్ల చేర్పునకు అడ్డుకట్ట వేయాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, సూళ్లూరుపేట నియోజవర్గ పరిశీలకులు బిరుదవోలు శ్రీకాంత్రెడ్డి సూచించారు. నాయుడుపేటలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన సమీక్షలో ముఖ్య అతిథులుగా ఎంపీతో పాటు నియోజవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీకి చెందిన బీఎల్ఏతోపాటు నాయకులందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు మాయల మరాటీలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ తిమ్మిని బమ్మిని చేసేలా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల చేర్పులు తదితర అక్రమాలకు పాల్పడితే వెంటనే గుర్తించి వాటిని అడ్డుకోవాలన్నారు. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా చూడాలన్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ అధికారపార్టీ టక్కు టమార విద్యలకు పాల్పడే అవకాశం ఉందని, దీనిపై బీఎల్ఏలు న్యాయబద్ధమైన ఓట్ల తొలిగింపులు చేపట్టకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, న్యాయ విభాగ అధ్యక్షుడు చదలవాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


