పాకాల: గుర్తు తెలియిని దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన సంఘటన పచ్చిపాలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇ.బిందు తన అమ్మమ్మతో కలసి ఉంటోంది. 12వ తేదీన బిందు అమ్మమ్మ ఇంటిని శుభ్రం చేసి, తాళం వేసి వెళ్లింది. అయితే 13వ తేదీ ఇంటి తలుపులు పగలగొట్టినట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఇంట్లో ఉన్న బీరువాలోని రెండు బంగారు తాళిబొట్లు, ఒక నల్లపూసల దండతో కలిపి సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 80 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తరుణ్ తెలిపారు.


