చంద్రగిరి: ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 1964 జూన్ 12వ తేదీన దేశంలో రెండో వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరున హైదరాబాద్లో ఏర్పాటు చేశారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో అనేక వ్యవసాయ కళాశాలలు, పరిశోధన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు పనిచేస్తూ రాష్ట్ర రైతాంగానికి విశిష్ట సేవలను అందించినట్లు తెలిపారు. రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున అభ్యుదయ రైతులను సన్మానించారు.
జూలై 11న జాతీయ లోక్ అదాలత్
తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో జూలై 11వ తేదీన తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం గురునాథ్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, వివాహ సంబంధ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, ఇతర కేసులతోపాటు వ్యాజ్యం వేయని కేసులను పరిష్కరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.


