కేవీబీపురం: పాఠశాల పునః ప్రారంభం రోజే కేవీబీపురం మండలంలోని గురుకుల కండ్రిక పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, విద్యా కమిటీ అనుమతి లేకుండా గతంలో విలీన ప్రక్రియ ఏర్పాటు చేసి, 3,4,5, తరగతులను ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న అంజూరు పాఠశాలలో విలీనం చేయడంతో అప్పటినుంచి ఆ గ్రామస్తులు పోరాటం సాగించారు. చివరకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గురుకుల కండ్రిగలోని పాఠశాల కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం పాఠశాల పునః ప్రారంభం కావడంతో 3 నుంచి 5 తరగతి విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయుడిని బయట కూర్చోబెట్టేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎట్టి పరిస్థితిలో పాఠశాలను తెరిచేది లేదని తేల్చారు.


