తిరుపతి రూరల్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో గుక్కెడు మంచినీళ్లు దొరక్క విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు బాటిళ్లలో తెచ్చుకుని, మరికొందరు కొళాయి నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఇదేనా మీరు అందించే మంచి పాలన? సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేయడమే విద్యాశాఖా మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. పిల్లలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో పరిపాలన సాగిస్తున్నారంటేనే అర్థమవుతోంది.. పేద పిల్లలపై వారికి ఎంత ప్రేమ ఉందోనని, ఏసీ గదులు, కార్లలో నుంచి బయటకు వెచ్చి కళ్లు తెరచి చూస్తే నీటి కోసం పిల్లలు పడుతున్న బాధలు కనిపిస్తాయి.’ అని రాష్ట్ర వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు ఓబుల్రెడ్డి విమర్శించారు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి కష్టాలు తీర్చాలని, నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చంగల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గుక్కెడు నీళ్ల కోసం పిల్లలు ఇబ్బంది పడుతుంటే నీరు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.


