చంద్రగిరి: కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారుజామున పోలీ సు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. దామినేడు లెక్కదాఖల సర్వే నంబర్ 181/5లోని 2.56 ఎకరాలు, 207, 208లోని సు మారు 4 ఎకరాల్లోని ప్రభుత్వ భూములను కూటమి నేతల అండతో కబ్జాదారులు ఆక్రమించారు. కొంతకాలంగా ఎలాంటి పత్రాలు లేకుండా ఇక్కడ స్థలాలు విక్రయించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా అ క్రమ నిర్మాణాలకు పూనుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తు న ప్రజలు, వామపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో ‘కబ్జా కోరల్లో దామినేడు భూమి’ శీర్షికతో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణల పాలవడం వాస్తవమేనని విచారణలో రెవెన్యూ అధికారులు అధికారులు తేల్చారు. ఈ క్రమంలో తిరుచానూరు పోలీసుల బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు ఆదివారం జేసీబీ సాయంతో సుమారు 7 ఇళ్లను నేలమట్టం చేశారు. దామినేడులో అధికారుల చర్యలపై ఓ వైపు హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ..ఏడు అక్రమ నిర్మాణాలను తొలగించిననూ వాటి పక్కనే ఉన్న మరో ఐదు ఇళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్రమంగా నిర్మించిన ఇళ్లలో నివాసం ఉన్నారని, వారికి సైతం నోటీసులు ఇచ్చామని, వాటిని కూడా త్వరలోనే తొలగిస్తామని రెవెన్యూ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.


