ఏర్పేడు: దేశంలో అంతరిక్ష విద్య భవిష్యత్తును నిర్వచించే లక్ష్యంతో ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో రెండు రోజుల పాటు ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరగనున్నట్లు పీఆర్వో చమన్ మెహతా తెలిపారు. తిరుపతి ఐఐటీ, మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోందన్నారు. ఇందులో కొత్తతరం అంతరిక్ష విజ్ఞానం, ఇంజినీరింగ్ పాఠశాల కోసం విద్యాపరమైన, నిర్మాణాత్మక చట్రంపై మేధోమథనం చేయడానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ ప్రయోగశాలలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ నుంచి నిపుణుల బృందం ఒకచోట చేరి, అంతరిక్ష రంగంలో సైద్ధాంతిక పరిశోధన, పారిశ్రామిక అనువర్తనం మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడంలో ప్రధాన ఘట్టంగా మారబోతుందన్నారు. ఇస్రో మాజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎన్. సురేష్ విఫలమైన మిషన్ల నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా రాకెట్ సైన్స్లో ప్రావీణ్యం సాధించడం అనే అంశంపై విశిష్ట ఉపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. ఈ వర్క్షాప్లో ఇస్రో, రక్షణ అంతరిక్ష సంస్థ, త్రివిధ దళాల ప్రతినిధులు, త్రివేండ్రం ఐఐఎస్టీ, బెంగుళూరు ఐఐఎస్సీ, ఐఐటీ మద్రాస్, బాంబే, ఇండోర్ ప్రతినిధులు, ఎల్ అండ్ టి ఏరోస్పేస్, గోద్రెజ్ ఏరోస్పేస్, ఇన్–స్పేస్, ఎన్ఎస్ఐఎల్ వంటి ఏరోస్పేస్ సంస్థల సీఈవోలు, వ్యోమిక్, ఎక్స్డిలింక్స్, సన్యా ర్క్ వంటి అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొంటారని వివరించారు. రెండవ రోజు, ఎంఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాహుల్ మెహతా, ఎం. గణేష్ పిళ్ళై, పద్మకుమార్, ఎం. శంకరన్, శుభాంశు శుక్లా, నాగ భారత్ డాకా వంటి ప్రముఖులు పాల్గొంటారన్నారు.


