తిరుపతి కల్చరల్: నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, తిరుపతి ఫిలిం సొసైటీ, కేజీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మహతి కళాక్షేత్రంలో ‘భగవన్నామ వైభవము’ అనే అంశంపై చాగంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. చాగంటి మాట్లాడుతూ, భగవంతుని నామస్మరణ అన్ని పాపాలను హరిస్తుందన్నారు. భగవంతుడు సర్వాంతరామి అని, ఆయన అనునిత్యం మన వెన్నంటే ఉంటారన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా మనిషి ప్రశాంతత పొందలేకున్నాడని, దీనికి కారణం అత్యాశ, ఇతరుల గురించి ఆలోచించకపోవడమేనన్నారు. మనం ఏ నామం స్మరించినా, ఏ పూజ చేసినా ఉపాసన సాధన, శ్రమ అవసరమని, నామస్మరణకు నియమాలు లేవని, ఏ రీతిలో భగన్నామ స్మరణ చేసినా ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని వివరించారు. అనంతరం చాగంటిని తిరుపతి ఫిలిం సొసైటీ ప్రతినిధులు ‘ప్రవచన ప్రశాస్త’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.
ఆధ్యాత్మికం.. శివస్తుతి నృత్య రూపకం
మహతిలో తొలుత భారత నృత్య కళాక్షేత్రం నిర్వాహకులు, ప్రముఖ నాట్యాచార్యులు ధనుశ్రీ, శ్రీనివా స్ ప్రదర్శించిన శివ స్తుతి నృత్య రూపకం ఆద్యంతం ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. పార్వతీ పరమేశ్వరుల నృత్య తాండవాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. టీటీడీ విశ్రాంత ఆస్థాన గాయకుడు బొమ్మిశెట్టి రఘునాథ్ అన్నమయ్య కీర్తనలతో రంజింపజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, తి రుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం. వేణుగోపాల్రెడ్డి, అధ్యక్షుడు వైఎస్.బాబు పాల్గొన్నారు.


