చంద్రగిరి: మంత్రి నారా లోకేష్ పర్యటనలో కూటమిలోని విబేధాలు బట్టబయలయ్యాయి. గత కొంత కాలంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమిలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. నారా లోకేష్ పర్యటనలో కూటమి పార్టీకు చెందిన ముఖ్య నేతలు ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి వారిలోని విబేధాలపై ప్రజలు చర్చింకుంటున్నారు.
అర్జీలకు నో ఎంట్రీ..!
తమ సమస్యలను మంత్రి నారా లోకేష్ పరిష్కారని ఎంతో ఆశతో కార్యక్రమం వద్దకు వచ్చిన అర్జీదారులకు నిరాశ ఎదురైంది. టీడీపీ నేతలకు గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతించారు. పోలీసులు ఎవరినీ అనుమతించకుండా ఎలాంటి అర్జీలను ఇచ్చేందుకు అనుమతులు లేవంటూ వెనుక్కు పంపారు.
ఎవరైనా బయట ఉండాల్సిందే..
మంత్రి నారా లోకేష్ పర్యటనపై ఆ పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పార్టీ అధికారం కోసం పనిచేస్తే, మమల్ని అడ్డుకోవడం ఏమిటంటూ ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో రాజకీయ బ్యానర్లు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభించారు. మంత్రి రాకతో టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో టీడీపీ నేతలు పసుపు జెండాలు, బ్యానర్లతో స్వాగత ఫొటోలను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రీడాభివృద్ధికి 90 రోజుల ప్రణాళిక: లోకేశ్
తిరుపతి తుడా: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పేర్కొన్నారు. తిరుపతిలోని గొల్లవానిగుంట స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో శాప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ మైదానం నిర్వహణకు కార్పొరేట్ సహకారం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ ప్రజాప్రతినిధులతోపాటు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, షట్లర్ పీవీ సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.


