శ్రీకాళహస్తి రూరల్: మండలంలోనీ మంగళపురి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను, పాఠశాల భూములను, చెరువులకు నీళ్లు వచ్చే వరవ కాలువలను మట్టితోలి చదును చేసి అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. పలువురు ఆక్రమణదారులు ఎ.వెంకటేష్, ఎస్. కాలేషా ప్రభుత్వ భూమి, ఎం.వెంకటేష్ పాఠశాల భూమి ఆక్రమించుకుని చదును చేశారు. పైభూములు శ్రీకాళహస్తి, ముచ్చివోలు, పల్లంపేట, వెంకటగిరి ఆర్అండ్బీ రోడ్డుకు పక్కన ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, వెంటనే స్పందించి సర్వే నిర్వహించి, భూ బకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలని మంగళపురి గ్రామస్తులు కోరుతున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ స్టిక్కర్
– టీడీపీ స్టిక్కర్తో తిరుమలకు ద్విచక్ర వాహనం
తిరుమల: అధికార టీడీపీ స్టిక్కర్ ఉన్న ఓ ద్విచక్ర వాహనం మంగళవారం తిరుమలలో దర్శనమివ్వడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పవిత్రక్షేత్రం తిరుమలలో రాజకీయాలకు ఎలాంటి స్థానం ఉండకూడదని, రాజకీయ పార్టీల బ్యానర్లు, స్టిక్కర్లతో రాకూడదని నిబంధన ఉంది. అయితే మంగళవారం ఓ ద్విచక్ర వాహనం తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లతో తిరుమలకు చేరుకుంది. ఈ సంఘటనతో తిరుమలలో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ విభాగం పనితీరుపై భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


