నాయుడుపేట టౌన్: మండలంలోని కూచివాడపాళెంలో పలువురు విషజ్వరాల బారిన పడి, అల్లాడిపోతున్నారు. కూచివాడపాళెం దళితవాడలో 130కి పైగా ఇళ్లు ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో జ్వరపీడితులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నా రు. జ్వరాలతో జనం మంచం పట్టి, నానా అవస్థలు పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నాలుగు రోజు ల క్రితం గ్రామంలో పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించారని, అయితే ప్రతి ఇంటికీ వచ్చి చికిత్సలు అందించలేదని గ్రామస్తులు వాపోయారు. దళిత కాలనీలో పలువురు జ్వరపీడితులు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, నాయుడుపేట, గూడూరు తదితర పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. దళిత కాలనీలోని నిరుపేదలమైన తాము రూ.వేలు వైద్యం కోసం వెచ్చాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోయారు. గ్రామానికి స్వర్ణ ముఖి నది నుంచే వచ్చే తాగునీటిని సైతం ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇచ్చి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. గ్రామంలో రోజురోజుకు జ్వరాలు అధికం అవుతున్నాయని, గ్రామంలోనే రెండు మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించి పరీక్షలు చేయాలని కోరుతున్నారు.
వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తాం
కూచివాడపాళెంతోపాటు దళితవాడలో పలువురు జ్వరాల బారిన పడిన విషయం వాస్తవమేనని గొట్టిప్రొలు పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శంకర్రావు అన్నారు. గ్రామంలో నాలుగు రోజులు కిందట వైద్య శిబిరం ఏర్పాటు చేసి, జ్వరపీడితు లకు చికిత్సలు చేశామన్నారు. ఇంకా పలువురికి జర్వాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.


