తిరుపతి తుడా: శెట్టిపల్లి భూ సమస్య కు గత ప్రభుత్వ హయాంలో శాశ్వత పరిష్కారం చూపుతూ లబ్ధిదారులకు ప్రొసెసింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమ న అభినయ రెడ్డి ఆ భూ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమస్యను పరిష్కరించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులకు వెంచర్ల ద్వారా ప్లాట్లు కేటాయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 50 మందికి చొప్పున రిజిస్ట్రేషన్లను చేపట్టారు. తొలిరోజు 80 శాతం మందికి సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి అ య్యాయి. కొన్ని రికార్డుల్లో మార్పు చేర్పుల కారణంగా కొందరికి రిజిస్ట్రేషన్ ఆలస్యమైంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోవిందరావు, సెక్రటరీ శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య పరిశీలించారు.
రైలు కింద పడి యువకుడి మృతి
రేణిగుంట: సీఆర్ఎస్ ఎదురుగా ఉన్న రైల్వే పట్టాల పైన యువకుడు రైలు కింద పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనంమేరకు.. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలోని ఎర్రమరెడ్డిపాళేం గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడి మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉండడం గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఆర్.రామరాజన్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.ఆ రు లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2017లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది శేషాచలం అటవీ ప్రాంతం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ వద్ద తనిఖీలు చేశారు. నిందితుడు రామరాజన్ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తుండగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రామరాజన్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


