రేణిగుంట: మామండూరులో వివాహితపై కత్తితో దాడి చేసి, తనకు తాను గాయపరచుకున్న వ్యక్తి తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలానికి చెందిన పాపేరి కృష్ణమూర్తి (44) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న మామండూరు గ్రామానికి చెందిన టి. మునెమ్మపై వ్యక్తిగత విభేదాలతో గత నెల 21వ తేదీన రాత్రి మామండూరు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద కత్తితో దాడి చేశాడు. దాడిలో మునెమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు పాపేరి కృష్ణమూర్తి తనను తానే కత్తితో గాయపరుచుకున్నాడు. గాయపడిన నిందితుడిని వెంటనే తిరుపతిలోని రుయాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


