తిరుపతి రూరల్: ట్రాన్స్ఫార్మర్లు చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. ట్రాన్స్ఫార్మర్ల చోరీపై జిల్లావ్యాప్తంగా పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. గత బుధవారం రాత్రి 10.45 గంటలకు రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్టకు పడమర వైపున ముత్యాలమ్మ గుడి ఆర్చ్ సమీపంలో కొందరు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో నిందితులుగా తేలడంతో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2.72 లక్షలు విలువైన సుమారు 252 కిలోల రాగి వైర్లు, మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో చంద్రగిరి మండలం దోర్నకంబాలకు చెందిన పరమాల చంద్రయ్య అలియాస్ నాసోడు, గాలి బాలాజీ, తుపాకుల పవన్ కుమార్ అలియాస్ కళ్యాణ్, తిరుపతి అన్నారావు సర్కిల్ యానాది సెంటర్కు చెందిన అక్షల నాగరాజు ఉన్నారన్నారు. కాగా చోరీ సొత్తు కొనుగోలు చేసిన నాయుడుపేట గోరపల్లిగుంటకు చెందిన హేమంత్, తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లికి చెందిన శ్రీకాంత్రెడ్డి, చంద్రగిరి భవానీనగర్కు చెందిన వల్లెమ్మపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించి, రివార్డులు ప్రకటించారు.


