
ఐసర్ స్నాతకోత్సవం రేపు
ఏర్పేడు: మండలంలోని జంగాలపల్లిలో ఉన్న భా రతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ( ఐసర్) ఆ రో స్నాతకోత్సవం మంగళవారం ఐసర్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ సంతాను భట్టాచార్య తెలిపారు. ఆదివారం ఆయన ఐసర్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసర్ ఏర్పడి 10 ఏళ్లు గడిచిందని గుర్తు చేసుకున్నారు. మంగళవారం జరగనున్న ఆరో స్నాతకోత్సవం గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో ఐసర్లో కోర్సులు పూర్తి చే సిన మొత్తం 255 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తామన్నారు. పట్టాలు అందుకోనున్న విద్యార్థులలో 22 మంది పీహెచ్డీ విద్యార్థులు, 8 మంది ఐపీహెచ్డీ విద్యార్థులు, ముగ్గురు ఎంఎస్ విద్యార్థులు, 141 మంది బీఎస్–ఎంఎస్ విద్యార్థులు, 69 మంది ప్రొఫెషనల్ మాస్టర్స్ విద్యార్థులు, ఆరుగురు బీఎస్ విద్యార్థులు, మరో ఆరుగురు బీఎస్సీ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా గోదావరి బయోరిఫైనరీస్ చైర్మన్ సమిర్ సోమైయా, ఐసర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్గా ఝిల్లుసింగ్ యాదవ్ పాల్గొంటారని చెప్పారు. స్నాతకోత్సవం మంగళవారం ఉదయం 9 గంటలకు ఐజర్లోని ఆడిటోరియంలో ప్రారంభం కానున్నట్లు తెలిపా రు. 2015లో ఐజర్ ప్రారంభించినప్పుడు తాము కేవలం బీఎస్–ఎంఎస్ కోర్సును మాత్రమే అందించామని, అయితే ప్రస్తుతం ఎన్నో పీహెచ్డీ ప్రోగ్రాంలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
త్వరలో అంతర్జాతీయ రీసెర్చ్ కోర్సు
ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ, ఐసర్ సంయుక్తంగా అంతర్జాతీయ రీసెర్చ్ కోర్సును త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల ఈ కోర్సులో చేరే విద్యార్థులు రెండేళ్లపాటు ఐసర్లో, మరో రెండేళ్లు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే ఈ ఏడాది నూతనంగా నాలుగేళ్ల బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెన్(బీఎస్– ఈఎస్ఎస్), రెండేళ్ల ఎంఎస్( మాస్టర్స్ బై రీసెర్చ్) కోర్సులను నూతనంగా ప్రారంభించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు, బోధనా సిబ్బంది కలసి 210 రీసెర్చ్ పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించారన్నారు. నేచర్ ఇండెక్స్–2025 ర్యాంకింగ్లో తిరుపతి ఐసర్ దేశంలోనే 33వ స్థానంలో నిలిచిందన్నారు.