
మామిడి రైతులకు న్యాయం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి నేలరాలుతోందని, న్యాయం చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద రైతు సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వ అలసత్వ వైఖరిని ఎండగట్టారు. రైతు సంఘం నాయకులు జనార్ధన్ మాట్లాడుతూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మామిడి కిలో రూ.12 పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని అనేక ఫ్యాక్టరీలు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. చాలా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాల్సింది పోయి రూ.5 ఇస్తున్నాయన్నారు. వారిని చూసి ర్యాంపుల నిర్వాహకులు రూ.3 ఇస్తున్నారని చెప్పారు. ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతుల ట్రాక్టర్లు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీని రూ.6గా అందజేయాలని డిమాండ్ చేశారు.
సబ్సిడీ రూ.5 ఇచ్చేలా ప్రతిపాదనలు
అనంతరం రైతు సంఘ నాయకులతో చిత్తూరు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా గుజ్జు పరిశ్రమల యజమానులు రూ.6 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీ రూ.4కు బదులు రూ.5 ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ర్యాంపుల ఆగడాలను అరికడతామని హామీ ఇచ్చారు. జిల్లాలో నిబంధనలు పాటించని నాలుగు ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ర్యాంప్లను సైతం క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రైతు సంఘ నాయకులు రామానాయుడు, ఉమాపతి, మునీశ్వర్రెడ్డి, ఆనంద్నాయుడు, మునిరత్నం, హేమలత, భారతి, రాజేందర్రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
గిట్టుబాటు ధరపై చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
రైతులతో చిత్తూరు కలెక్టర్ చర్చలు
ప్రభుత్వ సబ్సిడీ పెంపునకు ప్రతిపాదనలు