
రైల్వే గ్యారేజ్ పరిశీలన
రేణిగుంట : తిరుపతి– రేణిగుంట మార్గంలోని రైల్వే గ్యారేజ్ను రైల్వే బోర్డు అడిషనల్ మెంబర్ సంజయ్ కుమార్ పంకజ్ శనివారం పరిశీలించారు. సీఆర్ఎస్ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ దేవ సహాయం ఆయనకు స్వాగతం పలికారు. సీఆర్ఎస్ లోని అన్ని షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సీఆర్ఎస్ బ్రాంచ్ నాయకులు ఆయనను కలిసి తమ సమస్యల పైన వినతిపత్రం అందించారు. మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు మాట్లాడుతూ..సీఆర్ఎస్లో ఖాళీగా ఉన్న 306 పోస్టులను భర్తీ చేయాలని, వందే భారత్కు మాన్పవర్ ఇచ్చి దీనిపైన అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.సీ ఆర్ఎస్లో ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరా రు. కార్యక్రమంలో సీడబ్ల్యూ ఈ అమిత్ గుప్తా, మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ చైర్మన్ సదాశివ రెడ్డి, ట్రెజరర్ మునికుమార్, ఆఫీస్ బేరర్స్ ముని రాదయ్య, చంద్ర నాయక్ పాల్గొన్నారు.
వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలు
తిరుపతి ఎడ్యుకేషన్ : వైఎస్ఆర్ కడపలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీ వరకు ఉన్న గడువును 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ పాఠశాల ప్రత్యేకాధికారి జగన్నాథరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ‘‘ఏపీఎస్పీఓఆర్టీఎస్ఎస్సీహెచ్ఓఓఎల్.ఏపి.జీఓవి.ఇన్’’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రేణిగుంట కేవీలో
ప్రవేశాలకు దరఖాస్తులు
రేణిగుంట : రేణిగుంట సీఆర్ఎస్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ వి.శ్రీనివాసరావు శనివారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 2వ తరగతి (01), 4వ తరగతి (08), 9వ తరగతి (07) సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆసక్తిగల వారు ఈనెల 23 నుంచి 25 సాయంత్రం 4 గంటల లోపల కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సెలింగ్
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈనెల 21 నుంచి జూన్ 28వ తేదీ వరకు నిర్వహించనున్న సర్టిఫికెట్ల పరిశీలన (కౌన్సెలింగ్) శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి, గూడూరు, సత్యవేడులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లలో కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నట్లు తిరుపతి కేటి రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. తొలి రోజు 1 నుంచి 15 వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తొలిరోజు నిర్వహించిన కౌన్సెలింగ్కు తిరుపతిలో 107 మంది, గూడూరులో 30 మంది, సత్యవేడులో 6 మంది, మొత్తం 143 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్లో భాగంగా ఆదివారం 15,001 నుంచి 32 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నట్లు ఆయన తెలిపారు.