
మామిడి రైతులను ఆదుకుంటాం : కలెక్టర్
తిరుపతి అర్బన్ : మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆదుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఉద్యానశాఖ అధికారి దశరథ రామిరెడ్డి, వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావుతో కలసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే తోతాపురికి కిలోరూ.4 ప్రభుత్వ ప్రోత్సాహకంతో కలిపి పడుతుందని స్పష్టం చేశారు. సర్కార్ కిలోకు రూ.4 ఇస్తుందని, ఫ్యాక్టరీల నుంచి కేజీకి రూ.8 ఇప్పించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కొందరు కిలో రూ.5, రూ.6కి మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. అలా కాకుండా కిలో రూ.8 కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొనుగోలు చేసిన తర్వాత 10 రోజుల్లోపు రైతుకు ఫ్యాక్టరీ వారు చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వద్ద పల్ఫ్ నిల్వ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్యాంక్ రుణాలు కంతుల వారీగా చెల్లించాల్సిన నేపథ్యంలో వారికి గడువు ఇప్పించామని వివరించారు. జిల్లాలో 8 ఫ్యాక్టరీలు ఉన్నాయని...రోజుకు 2వేల టన్నులు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. చివరి గడువు అంటూ లేదని అందరి రైతుల నుంచి కొనుగోలు చేస్తామని వెల్లడించారు. మామిడి రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 87722 36007కు కాల్ చేస్తే.. సమస్యకు పరిష్కారం చూపుతారని స్పష్టం చేశారు. కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీ వద్ద ఉద్యానశాఖ, అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ ఉద్యోగులు ఉంటారని చెప్పారు. జిల్లాలో 24 వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉన్నప్పటికి 3 వేల హెక్టర్ల పంటకు ఈకేవైసీ చేయించుకోకపోవడంతో వారికి సర్కారు ఇచ్చే రూ.4 రాయితీ రాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
తోతాపురి కిలో రూ.8కి కొనాల్సిందే..
రైతుల సమస్యలకు కంట్రోల్ రూమ్