
కార్పొరేషన్ ఆస్తులు అమ్మితే ఊరుకోం
● వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక
తిరుపతి కల్చరల్ : నగరం నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన కార్పొరేషన్ ఆస్తులను విక్రయిస్తే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్సీపీ చిత్తూరు ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి వాసు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ హెచ్చరించారు. మంగళవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ ఆస్తుల విక్రయం సమాచార కరపత్రాలను వారు ఆవిష్కరించి మాట్లాడారు. బుధవారం జరగనున్న కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుతం చాణిక్య లాడ్జిగా నున్న స్థలాన్ని అమ్మడానికి చేయనున్న తీర్మానాన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. తిరుపతి కార్పొరేషన్కు చెందిన అత్యంత విలువైన స్థిరాస్తి చాణిక్యలాడ్జి భూమి 924 అంకనాల ఆస్తి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ అంకనం రూ.15 లక్షలు పలుకుతోందని, అయితే ప్రభుత్వ ధర రూ.60 వేలు అంకనంగా పేర్కొంటూ ఆ స్థలాన్ని అమ్మకానికి తీర్మానం తీసుకురావడం కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి నిదర్శనమన్నారు. నగర పాలక సంస్థ చేపడుతున్న నూతన పరిపాలన భవనానికి నిధుల కొరత సాకుతో కూటమి నేతలకు కట్టబెట్టే ప్రయత్నానికి తెర తీస్తున్నారని ఆరోపించారు. గతంలో యువనేత భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో రోడ్లను విస్తీర్ణం చేయడమేకాక, కార్పొరేషన్కు నిధులు కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్పొరేషన్ ఆస్తులు అమ్మ కం నిర్ణయాన్ని మానుకోకపోతే ప్రజలతో కలిసి భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు రవిశంకర్, రమణారెడ్డి, తేజ రాయల్, బాలాజీ, నరేష్ పాల్గొన్నారు.