● మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలు ● ప్రైవేటుకు మళ్లించేందుకు కూటమి కుట్ర ● ఆందోళన బాటలో తల్లిదండ్రులు ● పట్టించుకోని అధికారులు
తిరుపతి ఎడ్యుకేషన్ : వైఎస్సార్సీపీ హయాంలో సర్కారు బడులు పూర్వ వైభవాన్ని సంతరించుకుని విద్యార్థులతో కళకళలాడాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బడులను కార్పొరేట్కు దీటుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యతో పాటు మౌలిక వసతులు పెరిగాయి. అప్పటి ప్రభుత్వం చేపట్టిన విలీన ప్రక్రియను తప్పు పడుతూ అప్పటి ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ బడులు అస్తవ్యస్తం అవుతున్నాయంటూ నానా యాగీ చేసింది. అధికారంలోకి వస్తే సర్కారు బడుల విలీనం ఉండదని అప్పట్లో చంద్రబాబు , లోకేష్ హామీలు గుప్పించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి వెంటనే ప్లేటు ఫిరాయించి జిల్లాలో సర్కారు బడుల విలీన ప్రక్రియను చేపట్టి చకచకా పూర్తి చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత విద్యా విధానంలో 9 అంచెల పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక స్థాయిలో ఫౌండేషన్, బేసిక్, మోడల్ స్కూల్స్ పేరుతో విలీన ప్రక్రియకు తెరలేపి పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రోడ్లపై తీసుకొచ్చేలా చేశారు.
580 స్కూళ్లు విలీనం
ఎన్నికల సమయంలో విలీనం చేయబోమని కూటమి హామీ ఇచ్చి నేడు ఆ హామీని తుంగలో తొక్కింది. జిల్లాలోని ప్రతి మండలంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలను నెలకొల్పడంతో దాదాపు 580కి పైగా ప్రైమరీ పాఠశాలలు విలీనమయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపకుండా సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తుండడం గమనార్హం. విద్యాసంవత్సరం ప్రారంభంలో పలకా, బలపం చేతబట్టి పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు తమ పాఠశాలను కొనసాగించండి అంటూ బడులు మాని ఆందోళనలు చేస్తున్నారు.
విద్యారంగం నిర్వీర్యం
ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యేలా గతంలో టీడీపీ అనేక చర్యలు చేపట్టింది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యా రంగాన్ని గాడిలో పెట్టి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం గత టీడీపీ పాలనను గుర్తుకు తెచ్చేలా ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు విద్యారంగ నిపుణులు, మేథావులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. 9 అంచెల విధానాన్ని పాఠశాల విద్యలో తీసుకొచ్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిందిబోయి విలీనం పేరుతో ప్రభుత్వ బడులకు తాళాలు పడేలా నిర్ణయాలు తీసుకుంటోంది.
ప్రైవేటు స్కూళ్లే దిక్కు
దొరవారిసత్రంలోని ప్రాథమిక పాఠశాలలను ఏకొల్లులో కలపడం వల్ల అంత దూరం పిల్లలను పంపించలేం. ప్రైవేటు పాఠశాలలోనే చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందరి అభిప్రాయాలు సేకరించి చర్యలు చేపట్టాలి. – షేక్ నూరుల్లా, దొరవారిసత్రం
విద్యార్థులు బడికి వెళ్లరు
క్లస్టర్ పేరుతో పాఠశాలలను కలపడం వల్ల విద్యార్థులు బడికి పోరు. గ్రామాల్లో అధిక సంఖ్యలో డ్రాపౌట్లు పెరుగుతారు. పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షాలా మారుతుంది. కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల విద్యార్థులకు చదువు భారమే అవుతుంది.
– షేక్ నజీమా, దొరవారిసత్రం
కూటమి ప్రభుత్వం విలీనం పేరుతో ప్రభుత్వ బడులకు తాళాలు పడేలా వ్యవహరిస్తోంది. దీంతో ఉన్న ఊరులో బడులు మూత పడుతుండడంతో తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. కూటమి సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలు ప్రభుత్వ బడులకు ఉరి తాడుగా మారాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో కళకళలాడగా నేడు కూటమి పాలనలో సర్కారు బడులు మూతబడి వెలవెలబోతున్నాయి.
చిన్నారులకు విలీనబడి కష్టాలు
చిన్నారులకు విలీనబడి కష్టాలు
చిన్నారులకు విలీనబడి కష్టాలు
చిన్నారులకు విలీనబడి కష్టాలు