
డయేరియా నిర్మూలనే లక్ష్యం
తిరుపతి అర్బన్ : జిల్లాలో డయేరియా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని, ఈ మేరకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్, డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్తో కలసి డయేరియా నిర్మూలనపై బ్యానర్, పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూలై 31వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు స్టాప్ డయేరియా సిస్టమ్ అమలు చేయాలని స్పష్టం చేశారు. రోజుకు 3 కంటే ఎక్కువసార్లు నీళ్ల విరేజనాలు అయితే డయేరియాగా భావించాలని తెలిపారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తోపాటు జింక్ మాత్రలు అందించాలని, విరేచనాల సమయంలో పిల్లలకు పోషకాహారం ఇవ్వడం ద్వారా డయేరియాను నివారించవచ్చునని వివరించారు. 2 నెలల నుంచి 6 నెలలలోపు పిల్లలకు సగం జింక్ టాబ్లెట్ ఇవ్వాలని, 6 నెలల నుంచి నుంచి 5 ఏళ్ల వరకు ఒక జింక్ టాబ్లెట్తోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్ అందించాలని సూచించారు. డయేరియా కారణంగా మరణాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషినల్ డీఎంహెచ్ఓ శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి, వైద్యులు ఆనందమూర్తి, రాజా, అభిజ్ఞ పాల్గొన్నారు.