
పడిగాపులతో విసిగిపోయిన రైతులు
రోడ్డెక్కిన రైతులు – స్తంభించిన ట్రాఫిక్
జీడీనెల్లూరు, బంగారుపాళెం, తవణంపల్లెలోనూ అదే తంతు!
పట్టించుకోని కూటమి సర్కార్
కాణిపాకం: జిల్లాలో ప్రస్తుతం తోతాపురి రకం మామిడి కాయలు పక్వానికి రావడంతో కోతలు జోరందుకున్నాయి. ఈ కాయలను ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనడం లేదు. ఏదో కొన్ని ఫ్యాక్టరీలు మాత్ర బయట రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి కాయలను కొనుగోలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ఫ్యాక్టరీలు వాటిని లెక్కచేయడంలేదు.
చిత్తూరులో ఏం జరిగిందంటే...
చిత్తూరు నగరం గంగాసాగరంలోని ఓ గుజ్జు పరిశ్రమ సోమవారం టోకెన్లు ఇస్తున్నట్లు వారం రోజుల ముందే బోర్డు పెట్టింది. టోకెన్లు ఇస్తారని మామిడి రైతులు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడే కునుకు తీస్తూ.. ఆధార్, పట్టా పాసు పుస్తకం జిరాక్స్ నకలను క్యూలో పెట్టారు. ఉదయం 7గంటలకు రైతులు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నప్పటికీ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసికట్టుగా చిత్తూరు–వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసు లు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడారు. టోకెన్లు ఇస్తామని చెప్పడంతో ఆ తర్వాత ఫ్యాక్టరీ గేటు ను రైతులు చుట్టుముట్టేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అక్కడ రైతుల అరుపులు, కేకలతోఫ్యాక్టరీ ఆవరణ దద్ధరిల్లింది. అక్కడే ఉన్న వృద్ధురాలికి ఊపిరి ఆడలేదు. వెంటనే రైతులు ఆ వృద్ధురాలిని ఫ్యాక్టరీ లోపలికి పంపారు. ఆపై అరకొరగా టోకెన్లు ఇచ్చిన ఫ్యాక్టరీ నిర్వాహకులు వచ్చేనెల 5వ తేదీ టోకెన్లు ఇస్తామంటూ మరో బోర్డు పెట్టింది. దీంతో టోకెన్లు అందని రైతులు మళ్లీ నిరసనకు దిగారు.
పలుచోట్ల ఇదే పరిస్థితి
గంగాధర నెల్లూరు మండలంలో మూడు రోజులుగా కాయలను అన్లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు క్యూకట్టాయి. బంగారుపాళ్యం మండలంలో కూడా ఫ్యాక్టరీలు టోకెన్లు ఇవ్వకుండా తలుపులు వేసేశాయి. వచ్చే నెల టోకెన్లు ఇస్తామని ముఖం చాటేశాయి. ఒక చేసేది లేక రైతులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి, చివరికి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. తవణంపల్లె మండలంలోని ఫ్యాక్టరీలు కూడా మామిడి రైతులకు టోకెన్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి.
కూటమి నేతల సిఫార్సులకే టోకెన్లు
కూటమి నేతల సిఫార్సులకు మామిడి టోకెన్లు అమ్ముడుబోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, కలెక్టరేట్, ఇతరత్రా అధికారుల పేర్లు చెబుతూ టోకెన్లను దండుకుంటున్నారని ఫ్యాక్టరీ నిర్వాహకులు బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య రైతులు నిండి మునిగిపోతున్నారు. జిల్లాల్లో కొద్ది రోజులుగా హల్చల్ చేసిన రైతు సంఘం నాయకులు ఫ్యాక్టరీల ఎదుట కనిపించడం లేదు. కేవలం వారి పంటను మాత్రం అమ్ముకుని వెళ్లిపోయారని సామాన్య రైతులు చెబుతున్నారు.