
నిర్మల్టౌన్: బావ పెళ్లి చేసుకోవడం లేదని అనుమానంతో మరదలు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత ఆరేళ్ల క్రితం ఒంగోలు నుంచి గురునాథం శ్రీను కుటుంబంతో కలిసి నిర్మల్ రూరల్ మండలం డ్యంగాపూర్ గ్రామానికి వలసవచ్చి మేస్త్రి పని చేసుకుంటున్నారు. శ్రీను చెల్లెలు రాధ ఒంగోలులో నివాసం ఉంటోంది. రాధ భర్త తాగుడుకి బానిస కావడంతో.. ఆమె రెండో కుమార్తె భవాని(17)ని మూడేళ్ల క్రితం తీసుకువచ్చి వీళ్ల దగ్గరనే ఉంచుకున్నారు.
ఇంకో నాలుగేళ్ల తర్వాత శ్రీను తన కొడుకును, భవానిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. అయితే శ్రీను కొడుకు వేరే యువతితో ఫోన్లో మాట్లాడుతున్నాడని, తనను పెళ్లి చేసుకోడేమోనని భవాని అనుమానించింది. శనివారం రాత్రి 10 గంటలకు పూలమొక్కలకు కొట్టే పురుగుల మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.