హైదరాబాద్: ప్రతిరోజూ అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి మూసివేయనున్నారు. ఇక్కడి విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రింగ్రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శనివారం అధికారులు ప్రకటించారు. వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనా హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐఓíసీ, చెంగిచర్ల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలి.
చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాం«ధీ పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ వెనక నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. అలాగే.. బోడుప్పల్ నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద భగాయత్ లే అవుట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జీ కిందుగా యూ టర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాల్సి ఉంటుందని జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సూచించారు.
ప్రస్తుతం ఉప్పల్ జోనల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సుల స్టాప్ను తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వెళ్లే ప్రయాణికులంతా నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాప్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా సూచించారు.


