
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముంది.
ఇక, ఆవర్తనం కారణంగా హైదరాబాద్లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.