ఆర్టీసీ వింత నిర్ణయం.. ‘కరోనా’ముప్పున్నా రాకపోకలు షురు..

TSRTC Bus Services Begin To Maharashtra - Sakshi

మహరాష్ట్రకు స‍ర్వీసుల పునరుద్ధరణ

సరిహద్దుల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

సాక్షి, బోధన్: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో నిత్యంవేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారంనుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులునడుపుతోంది. అయితే, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగాఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులను  పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. ‘మహా’ ప్రభావంకారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లోపాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం విమర్శలకు తావిస్తోంది.

ఏడాదికి పైగా నిలిపివేత..
కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. మహారాష్ట్రలో మొదటి నుంచి వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఇటీవల అది మరింత ఎక్కువైంది. నిత్యం వేల సంఖ్యలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రంలో కర్ఫ్యూతో పాటు కొన్ని నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా మన ఆర్టీసీ అధికారులు వింతనిర్ణయం తీసుకున్నారు. కాగా,గత సోమవారం నుంచి బస్సుసర్వీసులను పునరుద్ధరించారు.

పొంచి ఉన్న ‘మహా’ ముప్పు..
తెలంగాణ–మహారాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది.జిల్లాలోని బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ మండలం పరిధిలోని కోటగిరి, బోధన్‌ రెవెన్యూ, రెంజెల్‌ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్‌ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలోగల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్‌ జిల్లా కేంద్రం ఉండగా, ఇదే జిల్లా పరిధిలోని బిలోలి,దెగ్లూర్, కొండల్‌వాడీ, ధర్మాబాద్‌ పట్టణ కేంద్రాలు,అనేక పల్లెలు తెలంగాణ ప్రాంత సరిహద్దు పల్లెలకు ఆనుకుని ఉన్నాయి.

రెండు రాష్ట్రాల సరిహద్దుపట్టణ కేంద్రాలు, పల్లెల నుంచి రాకపోకాలు సాగుతున్నాయి. గతంలో నిత్యం 10–12 బస్సు సర్వీసులలు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందెడ్, దెగ్లూర్‌ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి.కార్లు, ప్యాసింజర్‌ ఆటోలు ఎప్పడి నుంచో  తిరుగుతున్నాయి.

నిత్యం పదుల సంఖ్యలో కేసులు..
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర వద్ద చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రం నుంచివస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనాకేసులు సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులోగల సాలూర క్యాంప్‌ గ్రామంలోపాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌  ప్రకటించారు.

ఐదు సర్వీసుల పునరుద్ధరణ..
కరోనా నేపథ్యంలో మార్చి 24 నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి బస్సు సర్వీసులను  నిలిపివేశాం. అయితే, సోమవారం నుంచి నాందేడ్, దెగ్లూర్‌లకు ఐదుబస్సు సర్వీసులు పునరుద్ధరించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులునడుపుతున్నాం. సిట్టింగ్‌సీట్ల మేరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాం. 
రమణ, బోధన్‌ డిపో మేనేజర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top