ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు

TS High Court Clarified Registrations Invalid When Case Pending In Court - Sakshi

పిటిషన్లు పెండింగ్‌ ఉన్నప్పుడు అది సాధ్యం కాదన్న హైకోర్టు

ఆస్మాన్‌ జాహి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో రిసీవర్‌ కమ్‌ కమిషనర్‌ నియామకం

మార్చిలోగా నివేదిక సమర్పించాలని రిజిస్ట్రీకి ఆదేశం

మార్చి 23కు తదుపరి విచారణ

సాక్షి, హైదరాబాద్‌: కోర్టులో కేసు పెండింగ్‌ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్మాన్‌ జాహి కుటుంబానికి హైదరా­బాద్‌ పరిసరాల్లో రూ.వందల కోట్ల విలువైన భూము­లను గుర్తించేందుకు రిసీవర్‌ కమ్‌ కోర్టు కమిషనర్‌ను హైకోర్టు నియమించింది. పైగా భూములను గుర్తించి నివేదిక సమర్పించేవరకు రిజిస్ట్రేషన్లు, అభివృద్ధి ఒప్పందాలకు అనుమతించలేమని తెలిపింది. రిసీవర్‌ నుంచి నివేదిక అందాక తుది డిక్రీని ప్రకటిస్తామని పేర్కొంది.

హైకోర్టులో ఉన్న సీఎస్‌ 7/1958 పిటిషన్లో కొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేస్తూ ఉత్త­ర్వులు పొందుతున్నారని..ఇది వివాదాల పెంపునకు కారణమవుతున్న నేపథ్యంలో హైకోర్టు మేరకు నిర్ణయించింది. సీఎస్‌ 7కు సంబంధించి 2013లో జారీ చేసిన తుది డిక్రీని సవాలు చేస్తూ ఖాజామొయినుద్దీన్, అభివృద్ధి ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్‌ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ అనిస్‌ నిర్మాణ సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ శ్రావణ్‌ కుమార్‌ ధర్మాసనం విచారించింది.

మాజీ జిల్లా జడ్జీలు మహమ్మద్‌ బండె అలి, కె.అజిత్‌ సింహారావును కొత్త కమిష­నర్లుగా నియమించింది. ఆయా గ్రామాల్లోని షెడ్యూ­లు ఆధారంగా భూములను, వారసులను గుర్తించాలని రాజీ డిక్రీల వివరాలను కొత్త రిసీవర్లకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై మార్చిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రిసీవర్‌ల నుంచి నివేదిక అందిన తర్వాతే తుది డిక్రీ రూపకల్పన జరుగుతుందని పేర్కొంది. విచార­ణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top