TS EDCET 2021: ఎడ్‌సెట్‌ విజయం ఇలా

TS EDCET 2021: Registration, Exam Date, Syllabus, Exam Pattern, Preparation Tips - Sakshi

ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్‌సెట్‌ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాల గురించి తెలుసుకుందాం... 

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్‌ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. 

అర్హతలు
► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్‌), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్‌ లాంగ్వేజ్‌), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్‌ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్‌ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. 

► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 

► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్‌), బీవీఎస్‌సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు.

► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. 


పరీక్ష ఇలా
► ఎడ్‌సెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్‌–60మార్కులకు(మ్యాథమెటిక్స్‌–20మార్కులు, సైన్స్‌–20మార్కులు, సోషల్‌ స్టడీస్‌–20 మార్కులు), టీచింగ్‌ అప్టిట్యూడ్‌–20 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌–20 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌–30మార్కులు, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్‌సెట్‌ పరీక్ష సమయం రెండు గంటలు.

► ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. 

► గతంలో ఎడ్‌సెట్‌కు సంబంధించిన సిలబస్‌ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌/తెలుగు, ఇంగ్లిష్‌/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. 


సిలబస్‌ అంశాలు ఇవే
► తెలంగాణ స్టేట్‌ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. 

► మ్యాథమెటిక్స్‌:సంఖ్యావ్యవస్థ(నంబర్‌ సిస్టమ్‌), వాణిజ్య గణితం(కమర్షియల్‌ మ్యాథమెటిక్స్‌), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్‌), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్‌).

► ఫిజికల్‌ అండ్‌ బయోలాజికల్‌ సైన్స్‌: ఆహారం(ఫుడ్‌), జీవులు(లివింగ్‌ ఆర్గానిజమ్స్‌), జీవన ప్రక్రియలు(లైఫ్‌ ప్రాసెస్‌ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్‌), పదార్థం(మెటీరియల్‌), కాంతి(లైట్‌), విద్యుత్‌ అండ్‌ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజమ్‌), వేడి(హీట్‌), ధ్వని(సౌండ్‌), కదలిక(మోషన్‌), మార్పులు(చేంజెస్‌),వాతావరణం(వెదర్‌ అండ్‌ క్లయిమెట్‌), బొగ్గు అండ్‌ పెట్రోల్‌(కోల్‌ అండ్‌ పెట్రోల్‌), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్‌ నేచురల్‌ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్‌ అండ్‌ సోలార్‌ సిస్టమ్‌), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్‌ రియాక్షన్స్‌).

► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్‌ సైన్స్‌), అర్థశాస్త్రం(ఎకనామిక్స్‌).

► టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌: ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్‌ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి వాటిపై ఉంటాయి.

► జనరల్‌ ఇంగ్లిష్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్‌ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్‌ రీప్లేస్‌మెంట్, ఎర్రర్‌ డిటెక్షన్‌ అండ్‌ వర్డ్‌ అసోసియేషన్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

► జనరల్‌ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్‌ ఇష్యూ: కరెంట్‌ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన  విద్యాసమస్యలు, జనరల్‌ పాలసీలు, సైంటిఫిక్‌ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. 

► కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్‌వర్కింగ్, ఫండమెంటల్స్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.

 

ప్రిపరేషన్‌ ఇలా
► ఎడ్‌సెట్‌ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి.

► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఎంట్రన్‌లో మంచి మార్కులు(ర్యాంక్‌) సాధించేందుకు అవకాశం ఉంటుంది. 

► ఎడ్‌సెట్‌ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్‌ టెబుల్‌ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. 

► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్‌సెట్‌కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్‌టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. 

► కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌ కోసం పత్రికలను చదవడం, న్యూస్‌ బుల్‌టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్‌ కట్స్‌ను నోట్‌ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. 

► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్‌ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్‌బుక్‌ ఉపయోగించాలి. 

ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు విధానం: టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://edcet.tsche.ac.in/లాగిన్‌ అవ్వాలి. 
► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650.
► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా)
► హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 10.08.2021
► ఎడ్‌సెట్‌  పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021
► వెబ్‌సైట్‌:  https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top