హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జీవో నంబర్ 66 విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.
వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, టీజీఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ క్రింది అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తోంది..
కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ - ఛైర్మన్
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ - సభ్యుడు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ - సభ్యుడు
వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు & కన్వీనర్
కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి.


