
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. జీహెచ్ఎంసీ ఖజానాలో నిధులు లేకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో గ్రేటర్లో అభివృద్ధి పనులు కుంటుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ)తొలిదశ కింద చేపట్టిన పనుల్లో దాదాపు రూ.800 కోట్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు మందకొడిగా జరుగుతున్నాయి.
ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా నిధులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఎస్సార్డీపీ పనులు ఆగకుండా కొనసాగేందుకు బాండ్ల జారీతో పాటు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. పనులు జరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు నేరుగా కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాల్లోకే నిధులు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దాంతో పనులు ఆగలేదు. గత ఏడాది కాలంగా కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఏ పనీ చేయలేని దుస్థితి నెలకొంది. మరోవైపు గతంలో ఉన్న బీఆర్ఎస్ స్థానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టం కాలేదు. దీంతో అధికారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. పురోగతిలోని పనులకే నిధుల్లేకపోవడంతో కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో దాదాపు రూ.3వేల కోట్లుంటే కానీ జీహెచ్ఎంసీ యథావిధిగా ముందుకు సాగుతుందని సమాచారం. ఇంజినీరింగ్ నిర్వహణ పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు వెయ్యి కోట్లకుపైగా పేరుకుపోవడంతో వారు తరచూ ధర్నాలు చేస్తున్నారు. ఎస్సార్డీపీ తొలిదశలోని పనులు పూర్తయ్యేందుకు రూ. 800 కోట్లు కావాలి. వీటితో పాటు కొత్తగా ప్రాజెక్టులు, నిర్వహణ తదితర పనులు చేసేందుకు వెయ్యికోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. దీంతో దాదాపు రూ.3వేల కోట్లుంటే కానీ యథావిధిగా పనులు జరుగుతాయి. లేదంటే ఎక్కడి పనులక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు కనీసం రూ.2వేల కోట్లయినా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిసింది.
గతంలో ఫ్లై ఓవర్ల వంటి పనులకు జీహెచ్ంసీ నిధులిచ్చేది కాదు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీనే అప్పులు చేసుకొని, తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. అలా అందినకాడికి దాదాపు రూ.6వేల కోట్ల మేర అప్పులు చేశారు.వాటికి వడ్డీలు,ఈఎంఐల చెల్లింపుల వంటి వాటితో నెలనెలా సిబ్బంది జీతాల చెల్లింపులకే ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు కనీసం రూ.2వేల కోట్లయినా ఇచ్చి ఆదుకోవాలని జీహెచ్ఎంసీ ఆశపడుతోంది. ఆ మేరకు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిసింది. ఒక సంవత్సరంలో ప్రాజెక్టుల పనుల కోసం దాదాపు రూ.800 కోట్లు, ఇతర ఇంజినీరింగ్ పనులకు రూ.1200 కోట్లు ఖర్చు చేయవచ్చుననేది వారి ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఆస్తిపన్ను, టౌన్ప్లానింగ్ విభాగం ఫీజుల రూపేణా వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకు పోను మిగిలేవాటిని ఇతరత్రా పనులకు వినియోగించుకునేందుకు వీలవుతుంది.
ప్రభుత్వం కరుణిస్తుందా ?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతియేటా జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపడం తప్ప ప్రభుత్వం నుంచి నిధులందలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిధిలోనే జీహెచ్ఎంసీ ఉన్నందున ఈసారి నిధులందగలవని అధికారులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు ఏమేరకు ఫలిస్తాయో తెలియాలంటే కొద్దిరోజులాగాల్సిందే.