గ్రూప్‌–1 మెయిన్స్‌ ఫలితాలకు లైన్‌క్లియర్‌ | Telangana High Court Judgment on Group 1 Exam: Telangana | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 మెయిన్స్‌ ఫలితాలకు లైన్‌క్లియర్‌

Dec 27 2024 4:12 AM | Updated on Dec 27 2024 4:12 AM

Telangana High Court Judgment on Group 1 Exam: Telangana

పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు  

పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం 

ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చాక జీవోను సవాలు చేయడం సరికాదని వ్యాఖ్య....మొత్తం ఏడు పిటిషన్లు కొట్టివేత 

తీర్పు వెలువరించిన జస్టిస్‌ సుజోయ్‌పాల్,  జస్టిస్‌ జి.రాధారాణి ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ ఫలితాల వెల్లడికి లైన్‌క్లియర్‌ అయ్యింది. రాష్ట్రంలో కీలక పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్‌ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీజీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పిటిషన్ల దాఖలులో ఆలస్యాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. ఫిబ్రవరిలో తాజా నోటిఫికేషన్‌ ఇస్తే ఇందుకు సంబంధించిన జీవో 29 ప్రతి అప్‌లోడ్‌ కాలేదన్న కారణంతో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది.

ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడించిన తర్వాత జీవో ను సవాల్‌ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆర్టీకల్‌ 226 ప్రకారం తమకున్న విస్తృతాధికారాల మేరకు ఉత్తర్వులు వెలువరుస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ జి.రాధారాణి ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వివరాలిలా ఉన్నాయి.

గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం 2022లో ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిది. అయితే పేపర్‌ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు కాగా, ఆ తర్వాత ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్‌ ఇస్తూ జీవో 29 జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం టీజీఎస్‌పీఎస్సీ రూల్‌ ఆఫ్‌ లాను పాటించేలా, ప్రిలిమ్స్, మెయిన్స్‌.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2019లో జారీ చేసిన జీఓ 96ను కూడా సవాల్‌ చేశారు. ఇలా మొత్తం ఏడు పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. 

వాదనలు సాగాయిలా... 
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘మెయిన్స్‌కు ఎంపిక చేసిన 1ః50లో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. 1ః50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, అంతకు మించి మెయిన్స్‌కు ఎంపిక చేశారు. రీ నోటిఫికేషన్‌ ఇస్తూ జారీ చేసిన జీవో 29 కూడా చట్టవిరుద్ధం. 

రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్‌ ఫలితాలు వెల్లడించకుండా టీజీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ రాహుల్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దయ్యాయి. ఈ సారి ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాం. పిటిషన్లను అనుమతించవద్దు. మెయిన్స్‌ ఫలితాల వెల్లడిని అడ్డుకోవద్దు..’అని కోరారు. ఈ నెల 17న తుది వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. 

జీవో 55..  
గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం 2022, ఏప్రిల్‌ 25న గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 503 పోస్టులు భర్తీ చేసేందుకు జీవో 55ను జారీ చేసింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలిపింది. తెలంగాణ సబార్డినేట్‌ సర్విస్‌ రూల్స్‌ 22, 22 ఏ నిబంధనల ప్రకారం రిజర్వుడు కేటగిరీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ రిజర్వేషన్లు పాటించాలని స్పష్టం చేసింది. ఓపెన్‌ మెరిట్‌లో చోటు సంపాదించిన రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు ఓపెన్‌ మెరిట్‌తో పాటు సంబంధిత రిజర్వుడు కేటరిగీ పోస్టులకు కూడా పోటీ పడవచ్చని తెలిపింది.  

జీవో 29...  
ప్రస్తుత ప్రభుత్వం 2024, ఫిబ్రవరి 19న మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోస్టుల సంఖ్యను 503 నుంచి 563కు పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు జీవో 29ని జారీ చేసింది. రిజర్వుడు కేటగిరీతో సంబంధం లేకుండా పోస్టుల సంఖ్య మేరకు 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇందులో ఒకవేళ రిజర్వుడు కేటగిరీకి అనుగుణంగా ఆ వర్గాల అభ్యర్థులు లేకుంటే.. ఆ కేటగిరీలోని తదుపరి మెరిట్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. 1ః50 మేరకు రిజర్వుడ్‌ అభ్యర్థుల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులంతా ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు పోటీ పడవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement