
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్లు, నేతలు నిరసనకు దిగారు. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం ఇస్తామన్న బీజేపీ కార్పొరేటర్లు. ప్రజా సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ మెమోరండం ఇచ్చేందుకు కార్పొరేట్లరు లోపలికి వెళ్తాన్నారు. దీంతో, 15 మందిని లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అందరినీ అనుమతించాలని ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీసు ఎదుట బారికేడ్లు పెట్టి వారిని నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు, గేట్లను ఎక్కి ఆఫీసులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. కనీస సౌకర్యాలు ఇవ్వడం చేతకాదు కానీ.. అందాల పోటీలు పెట్టడానికి కోట్లు ఖర్చు చేశారు. అందాల పోటీలకు పెట్టే ఖర్చు పెడితే.. వీధి లైట్లు, నీళ్లు రావా?. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు కనీస అవసరాలైన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు.
