టెన్షన్‌ వీడితే పాస్‌ ఈజీనే | Students Do Not Take Stress During Board Exam Telangana 2022 | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ వీడితే పాస్‌ ఈజీనే

May 5 2022 5:48 AM | Updated on May 5 2022 5:51 AM

Students Do Not Take Stress During Board Exam Telangana 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఈనెల 23 వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను సిద్ధం చేశా రు. ఆర్టీసీ సౌజన్యంతో పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకం గా బస్సులు నడుపుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ‘ఈసారి కూడా 70% సిలబస్‌తోనే పరీక్షలుంటాయి.

ఎవరూ ఎలాంటి భయం పెట్టుకోవద్దు. టెన్షన్‌కు దూరంగా ఉండి, ఇంటర్‌ బోర్డు అందించిన స్టడీ మెటీరియల్‌ను ఫాలో అయితే పరీక్షల్లో తేలికగా విజయం సాధించే వీలుంది..’అని ఇంటర్‌ విద్య కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,07,394 మంది ఇంటర్‌ పరీక్షలు రాయబోతు న్నారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 4,64,626 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. కోవిడ్‌ వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు సజావుగా సాగలేదు. దీంతో విద్యార్థుల్లో పరీక్షల అలవాటు కాస్త తగ్గినట్టు కన్పిస్తోం దని నిపుణులు అంటున్నారు. ఈ కింది విషయా లను గమనంలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

గంట ముందే చేరుకోవాలి..

  • హాల్‌ టికెట్లు కాలేజీ నుంచే తీసుకోవాలనే రూల్‌ ఎక్కడా లేదు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దానిపై ప్రిన్సిపల్‌ సంతకం అవసరం లేదు. 
  • ప్రతీ విద్యార్థి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.  
  • కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశారు. 
  • సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోనికి అనుమతించరు. వాటర్‌ బాటిల్‌ అనుమతిస్తారు.

పరీక్షల వేళ ఏం చేయాలంటే...
ఇంటర్‌ విద్యార్థుల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఆందోళనగా ఉందని, భయమేస్తోందని చెబుతున్నారు. అందువల్ల విద్యార్థులు కొన్నింటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.  రోజూ కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. టీవీ, మొబైల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు నిద్రను పాడు చేస్తాయి. ఫలితంగా పరీక్షలపై దృష్టి తగ్గుతుంది. ఇంటర్‌ సిలబస్‌ మినహా అనవసరమైన ఇతర విషయాలపై మాట్లాడకూడదు. చర్చించకూడదు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. సినిమాలు, క్రికెట్‌ చూడొద్దు. ఇతరులతో కొద్దిపాటి ఘర్షణలకు కూడా ఆస్కారం ఇవ్వొద్దు. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే ఛాన్స్‌ ఉంది. పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందే చేరుకుని, పుస్తకాలు పక్కనబెట్టి వీలున్నంత వరకూ ప్రశాంతంగా ఉండాలి. కొన్ని నిమిషాలు మెడిటేషన్‌ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.  
– డాక్టర్‌ ఎ.అనిత (ఇంటర్‌ బోర్డు నియమించిన క్లినికల్‌ సైకాలజిస్ట్‌)

టెన్త్‌ రాయలేదు.. ఫస్టియర్‌లో టెన్షన్‌ 
టెన్త్‌ పరీక్షలు రాయలేదు. ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ టెన్షన్‌ పడ్డాం. కానీ ఇప్పుడు కాస్త అవగాహన వచ్చింది. కాలేజీలో అధ్యాపకుల గైడెన్స్, చివరి నెలలో ప్రిపరేషన్‌ నమ్మకం పెంచింది.  
– చేతమోని రజిత (ఇంటర్‌ విద్యార్థి, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా) 

స్టడీ మెటీరియల్‌ ఫాలో అయ్యాం  
కరోనా తగ్గడం, ఈసారి క్లాసులు బాగా జరగడంతో పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యాం. ఇంటర్‌ బోర్డ్‌ స్టడీ మెటీరియల్‌ను ఒకటికి రెండుసార్లు చదివాం. మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాం.  
– ఎం.నూతన్‌ ప్రసాద్‌ (ఇంటర్‌ విద్యార్థి, గార్ల ప్రభుత్వ కాలేజీ, ఖమ్మం)  

Advertisement
 
Advertisement
Advertisement