
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు తిరిగి వస్తున్నారు. ఈ మేరకు జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు అవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.
వివరాల ప్రకారం.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్టు తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, పాస్పోర్టు అందిన మూడు రోజుల్లో ఆయన భారత్కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తల దాచుకున్నారు. ప్రభాకర్ భారత్కు వస్తున్న పనేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ప్రభాకర్ ఉరావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఇక, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది