నల్గొండ జిల్లా: ప్రహరీ నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదంలో తన భర్త గిరగాని సురేశ్ను శాలిగౌరారం పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన గిరగాని జ్యోతి బుధవారం విలేకరులకు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తమ సమీప బంధువైన గిరగాని వీరమ్మకు చెందిన ఇంటి స్థలంలో యనమల్ల శంకర్ అనే వ్యక్తి ప్రహరీ నిర్మిస్తుండగా.. ఈ నెల 1న తన భర్త గిరగాని సురేశ్, యనమల్ల శంకర్ మధ్య గొడవ జరిగిందని ఆమె పేర్కొంది.
దీంతో శంకర్ అదేరోజు రాత్రి డయల్ 100కు ఫోన్ చేయడంతో ఇద్దరు పోలీసులు గ్రామానికి వచ్చారని.. వారికి, తన భర్త మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. దీంతో మరుసటిరోజు తన భర్తను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.
సురేశ్ను కొట్టలేదు..
ఈ నెల 1న యనమల్ల శంకర్, గిరగాని సురేశ్లు గొడవపడి కొట్టుకున్నారని, డయల్ 100కు ఫోన్ రావడంతో తమ కానిస్టేబుళ్లు శ్రీను, విక్రమ్ చిత్తలూరు గ్రామానికి వెళ్లి ఘర్షణపై విచారణ జరిపినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఈ క్రమంలో గిరగాని సురేశ్, అతడి తండ్రి గిరగాని వెంకన్న, దేశగాని విఠల్ తమ కానిస్టేబుళ్లతో గొడవపడి రాళ్లతో దాడి చేశారని ఎస్ఐ వివరించారు.
ఇద్దరు కానిస్టేబుళ్లు కాగా.. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఈ నెల 2న అరెస్ట్ చేసి నకిరేకల్ కోర్టులో హాజరుపర్చామన్నారు. సురేశ్పై కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వెంటనే కోర్టులో హాజరుపర్చామన్నారు. ఇరువర్గాల ఘర్షణలో సురేశ్కు దెబ్బలు తగిలి ఉంటాయే తప్ప పోలీస్ స్టేషన్లో ఎవరూ కొట్టలేదని, కావాలనే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు.


