Munugode Bypoll: ప్రచారానికి జనాన్ని పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే మరో బాధ | Munugode: Local Leaders Tension Money Distribution To People For Meetings | Sakshi
Sakshi News home page

Munugode Bypoll: ఇదెక్కడి గోస.. ప్రచారానికి పిలిస్తే ఓ బాధ, పిలవకపోతే మరో బాధ

Oct 21 2022 9:26 PM | Updated on Oct 21 2022 9:46 PM

Munugode: Local Leaders Tension Money Distribution To People For Meetings - Sakshi

సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాయి. పోటీలో వివిధ పార్టీల అభ్యర్థులు, చాలా మంది స్వతంత్రులు ఉన్నప్పటకీ ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నడుమనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు పార్టీలు నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యలో ఉంటున్నాయి. ఆయా పార్టీలు తమ కార్యకర్తలో సమావేశాలు నిర్వహిస్తే హంగామా కనిపించకపోవడంతో.. సామాన్య ప్రజానీకాన్ని సమీకరిస్తున్నాయి. ఆ క్రమంలో గ్రామాలు, కాలనీలకు చెందిన జనం పార్టీల సమావేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. 

జన సమీకరణతో మొదలవుతున్న నేతల కష్టాలు 
సమావేశాలు నిర్వహణ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య మాత్రం జనసమీకరణతోనే. సమావేశాలు, రోడ్‌షోలకు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో పార్టీ ఆయా కార్యక్రమాల పరిస్థితి మేరకు జనాన్ని సమీకరిస్తున్నాయి. ఇంతే మంది కావాలని కూడా చెబుతున్నాయి. అయితే పిలిచినదాని కంటే ఎక్కవగా జనాలు తరలివెళ్తున్నారు.

వద్దన్నా వినకుండా వస్తుండడంతో అందరికీ డబ్బులు చెల్లించలేక స్థానిక నేతులు తలలు పట్టుకుంటున్నారు. వద్దని చెబితే ‘రేపు మా ఓటు వద్దా’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జనాన్ని వద్దనలేక, అధిష్టానం వద్ద సరిపడా డబ్బులను తెప్పించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి స్థానిక నేతలే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకునేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. 

కొందరికి కాసులు.. మరి కొందరికి కష్టాలు..
సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల నాయకులకు పండుగ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని పార్టీలకు స్థానికంగా బాధ్యతలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇన్‌చార్‌్జలు వచ్చారు. వారంతా సభలు, సమావేశాలు, ప్రచార వ్యవహారాలు, జన సమీకరణ వంటి అన్ని అంశాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతలకు ఎలాంటి పని లేకుండా పోయింది.

కేవలం అసిస్టెంట్లుగానే మారారు. ఇదిలా ఉంటే జన సమీకరణ, ఇతర విషయాల్లో ఆయా పార్టీల్లోని కొంత మంది స్థానిక నేతలకు కాసుల వర్షం కురిపిస్తే మరి కొందరికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం స్వయంగానే చూసుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్‌్జల రాకతో అన్ని పార్టీల్లో లోకల్‌ లీడర్లకు మాత్రం నాలుగు పైసలు వెనుకేసుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement