
మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలి..
ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో మంత్రులు,
ఎమ్మెల్యేలతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో.. ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 516 గ్రామా ల్లో ఒకేసారి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే పనులు ప్రారంభించాలని, ఇదివరకే ఒకవేళ నిర్మాణాలు ప్రారంభించి..బేస్మెంట్ వరకు పూర్తయిన వారికి రూ.లక్ష తక్షణమే ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.
శుక్రవారం సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని, దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో డబ్బు చెల్లిస్తుందని, మొదటి విడతలో బేస్మెంట్ లెవల్ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇస్తుందని ఆ వివరాలను వెంటనే పంపించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని చెప్పారు. నిర్మాణం పూర్తికాక, కేవ లం గోడలు నిర్మించి కాంట్రాక్టర్ వెళ్లిపోతే. అలాంటి ఇళ్లను లబ్ధిదారులే నిర్మించునేలా అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని మంత్రి చెప్పారు.
తాగునీటి సమస్య లేకుండా...
వేసవిలో ఏ గ్రామంలో లేదా పట్టణాల్లోగాని తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవా లని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని, ప్రజలు తాగునీరు రావడం లేదన్న విమర్శ రాకుండా పనిచేయాలని సలహా ఇచ్చారు. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడం, చెడిపోయిన బోర్లు, హ్యాండ్ పంప్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
జూన్లోగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి..జూన్ చివరినాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించి, ఆ తర్వాత శాశ్వత పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలన్నారు.
మునిసిపల్ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి అక్కడ పర్యటించాలని మంత్రి సూచించారు. డంపింగ్ యార్డుకు 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్, రామచంద్రనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవ రాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉన్నతాధికారులు దానకిశోర్, హరిచందన, కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.