మా స్థానం గురించి ఏం మాట్లాడతారు?
కాంగ్రెస్ పార్టీకి పోటీయే లేదు.. మళ్లీ మాదే అధికారం
మీడియాతో ఇష్టాగోష్టిలో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయనకే స్థానం లేదని, ఇక మా స్థానం గురించి కేటీఆర్ ఏం మాట్లా డతారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ ఎద్దేవా చేశారు. వాళ్లు మూడో స్థానంలో ఉన్నారని, అందుకే మేం మూడో స్థానంలోకి వెళ్తామని అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. శనివారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర చేస్తామంటున్నారు. యాత్రలు చేయడంలో తప్పులేదు.
వైఎస్సార్ పాదయాత్ర, రాహుల్గాంధీ భార త్ జోడో యాత్రలు దేశ చరిత్రను మలుపు తిప్పా యి. కానీ వీళ్లు ఏమని యాత్రలు చేస్తారు? యాత్ర లో ప్రజలకు ఏం చెప్తారు? అయినా వీళ్లు యాత్రలు చేస్తే ఆదరించేవారు ఎవరు? అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీ, అస్తవ్యస్త పాలన, రైతుల ఆత్మహత్యలపై ప్రజలకు వివరణ ఇచ్చి వీళ్లు యాత్రలు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, బీజేపీ ఫాసిస్టు విధా నాలపై కేటీఆర్ స్పందించాలి’అని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీలు 8 మందీ ఓడిపోతారు..
రూ.వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్రెడ్డి అంటున్నారు. ఆయనే కేంద్ర బొగ్గు మంత్రి కదా? ఏం కుంభకోణం జరిగిందో విచారణ చేసి దోషులెవరో తేల్చవచ్చు కదా. ఈసారి బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు ఓడిపోతారు. అసలు వీళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మళ్లీ గెలుస్తారు? బీజేపీ అనే దుష్టసంహారం కోసమే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు జాతీయ స్థాయిలో పార్టీలు ముందుకొస్తున్నాయి. దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం ఏం చేయాలన్నదానిపై ఇటీవల ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. ఆ మేరకు ఈ నెల 24 నుంచి దేశవ్యాప్త కార్యాచరణ ఉంటుంది.’అని మహేశ్గౌడ్ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు..
‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సరైంది కాదు. అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కదా? రాష్ట్రం ఇవ్వాలని అడిగింది, ఇచ్చింది మేమే. అయినా ఏ రోజూ ప్రాంతీయ తత్వాలను ఉసిగొల్పి అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదు.
లీకు వీరులెవరో సీఎం తేలుస్తారు
పీసీసీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో నాకు తెలుసు. 40 ఏళ్లలో నేను నేర్చుకుంది అదే. తప్పు చేయనంతవరకు నేను భయపడేది లేదు. మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీ దిగజారి ప్రవర్తించింది. రిటర్నింగ్ అధికారి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరించి ఇలా చేశారు. ఆయన్ను ఉరితీసినా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ వారే సమాచారం ఇచ్చారని అనడంలో వాస్తవం లేదు. అయినా లీకు వీరులు, గ్రీకు వీరులెవరైనా ఉంటే సీఎం విచారణ జరిపి తేలుస్తారు. మీనాక్షి విషయంలో కోర్టుకు వెళతాం..’అని పీసీసీ చీఫ్ తెలిపారు.


