Delhi Liquor Scam: ED Notice To MLC Kalvakuntla Kavitha Delhi Visit Updates - Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకా? లేక..

Mar 8 2023 4:36 PM | Updated on Mar 8 2023 7:50 PM

Liquor Scam: ED Notice To MLC Kalvakuntla Kavitha Delhi Visit Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ బుధవారం నోటీసులు జారీ చేసింది. అయితే, బిజీ షెడ్యూల్‌ ఉన్నందున రేపటి ఈడీ విచారణను హాజరు కాలేనని ఆమె లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీన ఈడీ విచారణకు హాజరు అవుతానని కవిత లేఖలో​ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ ఫిక్స్‌ అయిన కారణంగా హాజరు కాలేనని తెలిపారు. అందుకే సమయం కావాలని కోరారు. 

ఇదిలాఉండగా.. కవిత విజ్ఞప్తిపై ఇప్పటివరకు ఈడీ నుంచి ఏ స్పందనా రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కవిత బంజారాహిల్స్‌ నివాసం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కవిత ఈడీ ముందుకు హాజరు కానున్నారా? లేదా జంతర్‌మంతర్‌ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా గతేడాది డిసెంబర్‌లో సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి మరీ సీబీఐ కవితను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎఫ్‌ఐఆర్‌కు తోడు ఇప్పుడు పిళ్లై స్టేట్‌మెంట్‌ కూడా ఈడీ దర్యాప్తులో కీలకంగా మారినట్లు స్పష్టమవుతోంది. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఈడీ పేర్కొనడం సంచలనంగా మారింది. ఇక కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్ గ్రూప్‌లో  రామచంద్ర పిళ్లై ఉన్నట్లు ఈడీ తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement