
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగించారు. కంట్మోనెంట్ బోర్డు పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు జరగడం ఇక్కడ విశేషం.
హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ గురువారమే రసూల్పురా నాలాను పరిశీలించారు. ఆపై కూల్చివేతలకు వారు ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా (Hydra) అధికారులు కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు..
తాజా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారాయన. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు, వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ చెప్పారు.
హైడ్రా (HYDRA) అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ 🚜💥అనే ప్రత్యేక సంస్థ. ఇది హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చేసింది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది.
