హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం(ఏప్రిల్ 18వ తేదీ) సాయంత్రం వేళ హైదరాబాద్లో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా పలు చోట్ల వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చని అంటున్నారు సంబంధిత శాఖ అధికారులు.
మరొకవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షం పడింది. డిచ్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్ పల్లి, సిరికొండ, మోపాల్, రూరల్ మండలాల్లో వర్షం కురిసింది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్లు వాన పడింది. ఈ అకాల వర్షంతో పలుచోట్ల వరి ధాన్యం తడిసిపోయింది.
ఇదిలా ఉంచితే, తెలంగాణలో ఎండలు కూడా హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 44.5 డిగ్రీ సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.


