ఎన్నికల వేళ కరెన్సీ కలకలం.. మరో ఐదు కోట్లు స్వాధీనం | HYD Police Seized Five Crores In Gachibowli | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ కరెన్సీ కలకలం.. మరో ఐదు కోట్లు స్వాధీనం

Nov 23 2023 5:11 PM | Updated on Nov 23 2023 5:40 PM

HYD Police Seized Five Crores In Gachibowli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 30వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక, తనిఖీలో భాగంగా భారీగా నగదు పట్టుబడుతున్నది. తాజాగా మరో ఐదు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, ఇ‍ప్పటి వరకు పట్టుబడిన నగదు ఏకంగా రూ.650 కోట్లకు పైగానే చేరుకున్నట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్బంగా గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదును పట్టుకున్నారు. రెండు కార్లలో రూ.5కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్‌ వైపుగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్లలో రూ.5కోట్లను తరలిస్తున్నట్లు గుర్తించి.. నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తదిగా సమాచారం. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: పవన్‌ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం!

Advertisement
 
Advertisement
Advertisement